

సంక్రాంతి సందర్భంగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలువురు దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉండగా, ఇప్పటికే బాబీ మరియు శ్రీకాంత్ ఓదెలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను ముందుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నెల 20 న ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్తో పాటు ఇతర భాషల నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. హీరోయిన్గా ప్రియమణి నటించనున్నారని, చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్ కనిపించనున్నారని చెబుతున్నారు. విలన్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటించే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమా ముంబై నేపథ్యంలో మాఫియా కథగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ఒక పవర్ఫుల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆయన కెరీర్లో ఇప్పటివరకు చూడని విధంగా ఈ పాత్ర ఉంటుందని చెబుతున్నారు. బాబీ ఈ చిత్రాన్ని యాక్షన్, మాస్ అంశాలు, భావోద్వేగాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!