

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న నిరుపయోగ భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పారిశ్రామిక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన భూములను నేరుగా టీజీఐఐసీ ద్వారా కేటాయించేలా ప్రభుత్వ భూములను ఒకే సంస్థ పరిధిలోకి తీసుకురావడమే ఈ ప్రతిపాదన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల ఆధీనంలో ఉన్న భూముల వివరాలు, వాటి వినియోగం, లీజుకు ఇచ్చిన భూముల వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అదే సమయంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడంపైనా కేబినెట్ చర్చించనుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలు, ఐటీఐలు ఇప్పటికే శక్తి శాఖ పరిధిలో ఉండటంతో పాలిటెక్నిక్ కళాశాలలను కూడా అదే శాఖ కిందకు తీసుకువస్తే నైపుణ్యాభివృద్ధి సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గూడెందొడ్డి, గట్టు ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు, గూడెందొడ్డిపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లోపాలపై చర్చ కూడా జరగనుంది. ధాన్యం అధికంగా పండే జిల్లాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలకు మహిళా సంఘాలకు భూముల కేటాయింపు, మెట్రో ఫేజ్-1కు రుణ సేకరణ, ఫేజ్-2 విస్తరణ, 22-ఏ నిషేధిత భూములు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!