

సుప్రీంకోర్టు ఖమ్మం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారం గ్రామంలోని రక్షిత అటవీ భూములపై వడియాల ప్రభాకర్రావుతో పాటు మరో ఎనిమిది మంది చేసిన క్లెయిమ్ను కొట్టివేసింది. సర్వే నంబరు-81లోని 787 ఎకరాలను రక్షిత అటవీ భూమిగా ప్రకటించగా, అందులో 600 ఎకరాలు తమవేనని వారు వాదించారు. అయితే రెవెన్యూ రికార్డులు, పహాణీలు, జమాబందీలు కేవలం ఆర్థిక అవసరాల కోసం మాత్రమేనని, అవి యాజమాన్య హక్కులను నిర్ధారించే హక్కుపత్రాలు కావని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్లు పంకజ్ మిత్తల్, ఎస్.వి.ఎన్. భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
వివాదాస్పద భూమిపై తమకు లేదా తమ పూర్వీకులకు హక్కులు ఉన్నట్లు పిటిషనర్లు ఎలాంటి ప్రాథమిక హక్కు పత్రాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. భూమి పన్నులు చెల్లించడం, రెవెన్యూ రికార్డుల ఆధారంగా బ్యాంకు రుణాలు పొందడం వల్ల యాజమాన్య హక్కులు ఏర్పడవని స్పష్టం చేసింది. అలాగే పట్వారీ నిర్వహించే రెవెన్యూ రికార్డుల్లో అనుమానాస్పద ఎంట్రీలు హక్కులను సృష్టించలేవని పేర్కొంది. ఖమ్మం జాయింట్ కలెక్టర్ 2003లో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన సుప్రీంకోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ప్రశంసించింది. ఈ కేసులో ఇకపై ఎలాంటి వివాదం కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అప్పీల్స్ను కొట్టివేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!