

జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా కేబినెట్ హోదాతో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పచ్చదనంతో కళకళలాడే ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని పవన్ పేర్కొన్నారు. ప్రకృతిపై ఎంతో ఆసక్తి, ప్రేమ ఉన్న నాగబాబు ఈ కీలక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.
2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ భారీ కార్యక్రమాన్ని నాగబాబు సమర్థంగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మలిచే దిశగా ఆయన విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. మరోవైపు నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన కూటమి భాగస్వామ్య పక్షాల నేతలకు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!