

భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా వివిధ కారణాలతో టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో, వెట్టిచాకిరి నిర్మూలనలో విఫలమయ్యారని భారత్ సహా పలు దేశాలపై అదనపు సుంకాలు విధించాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) ప్రతిపాదించింది. ఈ నిర్ణయంపై భారత్ స్పందిస్తూ, అమెరికా వైఖరి అస్థిరంగా ఉందని విమర్శించింది. యూఎస్ ప్రజలకు అవసరమైన 1600 వస్తువులపై మినహాయింపులు ఇస్తూ, మరికొన్నింటిపై భారీ సుంకాలు విధించడం సరైన విధానం కాదని భారత వాణిజ్యశాఖ సంయుక్త కార్యదర్శి బ్రిజ్ మోహన్ మిశ్రా తెలిపారు.
యూఎస్ అనుసరిస్తున్న ఈ విధానం ప్రపంచ సరఫరా గొలుసులో వెట్టిచాకిరి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత ముడిసరకుతో తయారయ్యే ఉత్పత్తుల కంటే, యూఎస్ పత్తితో తయారైన వస్త్రాలపై తక్కువ సుంకాలు విధించడం అసమానతలకు దారితీస్తోందని అన్నారు. ఈ సమస్యలపై చర్చలకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో, అమెరికా సుమారు 60 దేశాలపై అదనపు సుంకాలను ప్రతిపాదించగా, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!