

వివిధ దేశాలు, ఖండాల వాస్తవ వైశాల్యాన్ని మరింత కచ్చితంగా చూపించే ‘ఈక్వల్ ఏరియా మ్యాప్’ వినియోగంపై ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. ఈ కొత్త మ్యాప్ ప్రొజెక్షన్లో దేశాలు, ఖండాల విస్తీర్ణం వాటి వాస్తవ పరిమాణాలకు దగ్గరగా కనిపించేలా ఉంటుంది. ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న మర్కేటర్ ప్రొజెక్షన్లో భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ప్రాంతాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తాయి. కొత్త పటంలో భారత్, ఆఫ్రికా వంటి ప్రాంతాలు మరింత వాస్తవిక పరిమాణంలో కనిపించనున్నాయి. అయితే ఈ మార్పులు కేవలం మ్యాప్ చిత్రణకు సంబంధించినవే తప్ప.. ఏ దేశ భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు చేయవు.
అయితే ఐరాస తీర్మానానికి భారత్ మద్దతు ఇవ్వడాన్ని సరిహద్దులు, వివాదాస్పద భూభాగాలు లేదా ప్రాంతాల పేర్లలో రాజకీయ మార్పులకు ఆమోదంగా భావించరాదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్వాల్ మాట్లాడుతూ.. తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసినప్పటికీ, దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాలను భారత అధికారిక పటం ప్రకారమే చూపించాలని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా తప్పుదారి పట్టించే విధంగా చేసే ఏ చిత్రీకరణనూ భారత్ అంగీకరించదని తేల్చిచెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!