

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కొత్తగా ఆరు లేన్ల ద్విమార్గ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల మీదుగా రూ.189.68 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తైన అనంతరం పురపాలక శాఖ ఏజెన్సీ ఎంపికకు ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయం, జాతీయ రహదారుల వైపు రాకపోకలు సులభతరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేబీఆర్ పార్క్ జంక్షన్, ఫాక్స్ సాగర్ బ్రిడ్జి, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్, పంజాగుట్ట ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్, అల్విన్ కాలనీ, రసూల్పుర జంక్షన్ల వద్ద ఇప్పటికే వంతెనల పనులు కొనసాగుతున్నాయి.
ఈ ప్రాజెక్టుకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థను ఎల్-1 బిడ్డర్గా ఎంపిక చేశారు. సంస్థ రూ.189.68 కోట్లు కోట్ చేసింది, ఇది అంచనా వ్యయానికి 4.71 శాతం ఎక్కువ. ఎన్సీసీ లిమిటెడ్ రూ.189.88 కోట్లు కోట్ చేసింది, ఇది 4.82 శాతం అధికం. ఈ వంతెన పూర్తయితే నగరంలోని పలు దక్షిణ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి రాకపోకలు మరింత సులభమవుతాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!