

2028 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్-ఆఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి రద్దీ నగరాల్లో భవిష్యత్తు రవాణాకు కీలకంగా మారనున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఈ సాంకేతికతకు సంబంధించిన పరీక్షలను మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు.
ఈవీటీఓఎల్ విమానాల వినియోగంతో నగరాల్లో ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గంటన్నర నుంచి రెండు గంటలు పట్టే ప్రయాణాలను కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. సర్లా ఏవియేషన్కు డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్ లభించిందని, నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వచ్చే ఏడాది పూర్తిస్థాయి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీల్లోనూ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలకు గణనీయమైన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!