

వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ మార్చి త్రైమాసికంలో రూ.1,793 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,340 కోట్లతో పోలిస్తే ఇది 33.8 శాతం వృద్ధి. కంపెనీ మొత్తం ఆదాయం రూ.21,863 కోట్ల నుంచి రూ.26,098 కోట్లకు పెరిగింది, కాగా మొత్తం వ్యయాలు రూ.24,134 కోట్ల వద్ద స్థిరంగా నిలిచాయి. ఈ త్రైమాసికంలో వాహనాల టోకు అమ్మకాలు 1.32 లక్షలకు చేరుకుని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం పెరిగాయి.
పూర్తి ఆర్థిక సంవత్సరం 2025–26లో కంపెనీ నికర లాభం రూ.3,030 కోట్లుగా నమోదై, 2024–25లోని రూ.3,195 కోట్లతో పోలిస్తే కొంత తగ్గింది. కొత్త కార్మిక చట్టాల ప్రభావం మరియు విభజన వ్యయాలు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. అయినప్పటికీ మొత్తం ఆదాయం రూ.58,217 కోట్ల నుంచి రూ.83,855 కోట్లకు పెరిగింది, వాహన టోకు అమ్మకాలు 14 శాతం వృద్ధితో 4.28 లక్షలకు చేరుకున్నాయి. ఎండీ, సీఈఓ గిరీశ్ వాఘ్ ప్రకారం వాణిజ్య వాహన రంగం కోవిడ్కు ముందు స్థాయిలను దాటిందని, తాత్కాలికంగా స్వల్ప మందగమనం కనిపించొచ్చని అన్నారు. ఒక్కో షేరుపై రూ.4 (200%) తుది డివిడెండ్ను బోర్డు సిఫారసు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!