

ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువుల అన్వేషణ సంస్థ ఓఎన్జీసీకి వెనెజువెలాలో మళ్లీ చమురు, గ్యాస్ ఉత్పత్తి చేపట్టేందుకు అమెరికా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) ఇందుకు అనుమతి ఇచ్చినట్లు ఓఎన్జీసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆంక్షల కారణంగా ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే కార్యకలాపాలు సాగించిన సంస్థ, తాజా నిర్ణయంతో ఉత్పత్తిని పెంచుకునే అవకాశం పొందింది.
ఓఎన్జీసీ విదేశ్, వెనెజువెలా ప్రభుత్వ రంగ సంస్థ పీడీవీఎస్ఏతో కలిసి శాన్ క్రిస్టోబాల్ చమురు క్షేత్రంలో 40 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే కారాబొబో ప్రాజెక్టులో 11 శాతం వాటా ఉంది. అమెరికా తాజా అనుమతితో ఈ రెండు క్షేత్రాల్లో ఉత్పత్తిని పూర్తి స్థాయిలో పెంచడంతో పాటు, కొత్త చమురు, గ్యాస్ క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఏర్పడింది. దీంతో మరిన్ని భారతీయ కంపెనీలు వెనెజువెలా ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మిరె అసెట్స్ షేర్ఖాన్ బ్రోకరేజీ అంచనా వేసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు వెంటనే తగ్గకపోతే సెప్టెంబరు 15 నాటికి బ్రెంట్ ముడి చమురు ధర బ్యారల్కు 100 డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం బ్రెంట్ ధర బ్యారల్కు సుమారు 90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!