

బ్యాంకులు ప్రజా ధనంతో వ్యాపారం నిర్వహిస్తాయని, రుణాలను మంజూరు చేసే సమయంలో తమ అధికార పరిధిని మించకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. మంజూరు చేసిన రుణాల తుది వినియోగాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని, అలా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు దారి తీసే అవకాశం ఉందని పేర్కొంది. బ్యాంకు ఉద్యోగులు డిపాజిటర్లు లేదా ఖాతాదారుల డబ్బును నిర్వహిస్తారని గుర్తుచేస్తూ, తమ విధులను అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రతి సంస్థ తన ఉద్యోగుల నుంచి మంచి ప్రవర్తన మరియు క్రమశిక్షణను ఆశిస్తుందని, ముఖ్యంగా ప్రజల డబ్బుతో పనిచేసే సంస్థలు మరింత ఉన్నత ప్రమాణాలను కోరుకుంటాయని స్పష్టం చేసింది.
ఈ కేసు వివరాల ప్రకారం, రుణాల పంపిణీలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2011 సెప్టెంబర్ 30న ఒక బ్యాంకు ఉద్యోగిపై ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ కేసులో పంజాబ్–హర్యానా హైకోర్టు 2023 ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో, రుణాల తుది వినియోగాన్ని నిర్ధారించడంలో ఆ ఉద్యోగి పాక్షికంగా విఫలమయ్యారని ధర్మాసనం గుర్తించింది. దీంతో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, అతని పెన్షన్ను శాశ్వతంగా మూడు దశల్లో తగ్గించాలని ఆదేశించింది. ఆ ఉద్యోగి 2011 సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందారని, చివరి వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కించినప్పటికీ, కోర్టు ఆదేశాల ప్రకారం దాన్ని సవరించడం సాధ్యమేనని పేర్కొంది. చివరగా ఉద్యోగి అప్పీల్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!