

వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏ) ద్వారా లభించే అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పరిశ్రమ సంఘాలకు పిలుపునిచ్చారు. 2026-27 వార్షిక బడ్జెట్పై నిర్వహించిన రెండో వెబినార్లో ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులను వేగవంతం చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతలను స్వీకరించి, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విశ్వసనీయ తయారీ భాగస్వాముల కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ తన ప్రాధాన్యాన్ని మరింత పెంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.
వాణిజ్య ఒప్పందాల ద్వారా కలిగే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే నాణ్యతే ప్రధాన మంత్రంగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేయడం, ఇతర దేశాల అవసరాలను విశ్లేషించడం, విస్తృత పరిశోధనలు నిర్వహించడం అత్యవసరమని తెలిపారు. లక్ష్య విపణుల్లో వినియోగదారుల అభిరుచులు, సౌలభ్యాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ఉత్పత్తులను రూపుదిద్దాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నాణ్యతే భారత ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తెస్తుందని, అప్పుడే ఎఫ్టీఏల ద్వారా లభించే ప్రయోజనాలను పూర్తిగా అందిపుచ్చుకోవచ్చని అన్నారు.
భారత్ అభివృద్ధి దిశ స్పష్టమైందని, మరింత ఉత్పత్తి చేసి ఎగుమతులను పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రధాని పేర్కొన్నారు. అయితే పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసినప్పుడే లక్ష్యాలు సాధ్యమవుతాయని చెప్పారు. తయారీ, లాజిస్టిక్స్, ఎంఎస్ఎమ్ఈలు, చిన్న మరియు పెద్ద నగరాలు అన్ని భారత ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభాలని పేర్కొన్నారు. ఎంఎస్ఎమ్ఈ వర్గీకరణలో తీసుకొచ్చిన సంస్కరణలు, మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ రంగాలకు రికార్డు స్థాయి మూలధన వ్యయాలు, రేర్ ఎర్త్ కారిడార్స్, కంటెయినర్ తయారీ, బయోఫార్మా శక్తి మిషన్ వంటి కార్యక్రమాలు దేశాన్ని గ్లోబల్ తయారీ మరియు బయోలాజిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తీసుకెళ్తాయని ప్రధాని వివరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!