

మార్చి నెలలో దేశ వంటనూనెల దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి 11.73 లక్షల టన్నులకు చేరాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ముడి పామాయిల్ దిగుమతులు గణనీయంగా పెరగడమే. గత ఏడాది మార్చిలో 10,45,281 టన్నులుగా ఉన్న దిగుమతులు, ఈ ఏడాది అదే నెలలో 11,73,168 టన్నులకు పెరిగాయి. ముడి పామాయిల్ దిగుమతులు 3,43,949 టన్నుల నుంచి 6,73,965 టన్నులకు దూసుకెళ్లగా, నాన్-ఎడిబుల్ నూనెల దిగుమతులు మాత్రం 27,742 టన్నుల నుంచి 13,401 టన్నులకు తగ్గాయి. మొత్తం మీద ఎడిబుల్ మరియు నాన్-ఎడిబుల్ నూనెల కలిపి దిగుమతులు 11% వృద్ధితో 11,86,569 టన్నులకు చేరాయి. దేశీయ అవసరాల్లో సగానికి పైగా వంటనూనెల కోసం భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేసియా నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయాబీన్ నూనెను ప్రధానంగా దిగుమతి చేస్తోంది.
2025-26 మార్కెటింగ్ సంవత్సరం (నవంబర్ నుంచి అక్టోబర్ వరకు) తొలి ఐదు నెలల్లో మొత్తం వెజిటబుల్ నూనెల దిగుమతులు 8% పెరిగి 65,72,131 టన్నులకు చేరాయి. అయితే 2026 ఫిబ్రవరిలో 12.92 లక్షల టన్నులుగా ఉన్న దిగుమతులు, మార్చిలో 10% తగ్గి 11.73 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వంటి కారణాలతో డిమాండ్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో దేశీయంగా ఆవాల పంట లభ్యత పెరగడంతో దిగుమతులపై కొంత ఒత్తిడి తగ్గింది. మరోవైపు, 2025 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య దిగుమతులు పెరగడానికి కారణం, అంతర్జాతీయ సరఫరాలో అంతరాయాలు కలగొచ్చన్న భయంతో దిగుమతిదారులు ముందుగానే సరుకును దిగుమతి చేసుకోవడమేనని పరిశ్రమ సంఘం వివరించింది.














.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!