

హరియాణా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖాతాల్లో తమ ఉద్యోగులు మరియు మరికొంతమంది వ్యక్తులు కలసి రూ.590 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలియజేసినట్లు, అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. చండీగఢ్లోని ఒక శాఖలో కొందరు ఉద్యోగులు హరియాణా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో అనధికారికంగా, మోసపూరిత లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని బ్యాంక్ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు, సంస్థలు లేదా సంబంధిత పక్షాల ప్రమేయం కూడా ఉండొచ్చని తెలిపింది. ప్రస్తుతం మోసం విలువను సుమారు రూ.590 కోట్లుగా అంచనా వేసింది.
తదుపరి సమాచారం, క్లెయిమ్ల పరిశీలన మరియు రికవరీల ఆధారంగా తుది నష్టం ఎంత అన్నది నిర్ధారిస్తామని బ్యాంక్ స్పష్టం చేసింది. హరియాణా ప్రభుత్వ విభాగం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్తో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఒక దశలో ఖాతా మూసివేత మరియు మిగిలిన నిల్వను మరొక బ్యాంకుకు బదిలీ చేయాలని అభ్యర్థన అందినట్లు తెలిపింది. ఈ ప్రక్రియలో ఖాతాలో ఉన్న వాస్తవ నిల్వతో పోలిస్తే గణనీయమైన వ్యత్యాసం బయటపడిందని పేర్కొంది. ఇదే తరహా సమస్యలు ఈ నెల 18 నుంచి హరియాణా ప్రభుత్వానికి సంబంధించిన మరికొన్ని ఖాతాల్లో కూడా గుర్తించినట్లు బ్యాంక్ వెల్లడించింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!