

మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా ప్లాట్ఫామ్స్ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ గ్లోబల్ వర్క్ఫోర్స్లో సుమారు 20 శాతం వరకు ఉద్యోగులను తగ్గించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మెటాలో సుమారు 79,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో దాదాపు 16,000 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. గతంలో 2022–23 లో ప్రకటించిన ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ’ సమయంలో జరిగిన ఉద్యోగాల కోత కంటే ఈసారి చర్యలు మరింత పెద్ద స్థాయిలో ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
కంపెనీ ప్రస్తుతం ఏఐ మౌలిక సదుపాయాల పై భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. డేటా సెంటర్లు, ఏఐ చిప్ల అభివృద్ధి కోసం దాదాపు 600 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలనే ప్రణాళిక ఉందని సమాచారం. ఈ భారీ పెట్టుబడి భారాన్ని తగ్గించుకునేందుకు కంపెనీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని నివేదికలు చెబుతున్నాయి.
ఇక ఈ లే ఆఫ్స్కు ప్రధాన కారణంగా ‘ఏఐ ఆధారిత పని విధానం’ను పేర్కొంటున్నారు. గతంలో పెద్ద బృందాలు కలిసి చేసే పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ సహాయంతో ఒకే నైపుణ్యం ఉన్న ఉద్యోగి పూర్తి చేయగలడని జుకర్బర్గ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మిడిల్ మేనేజ్మెంట్ విభాగాలు, రియాలిటీ ల్యాబ్స్ (మెటావర్స్) సంబంధిత టీమ్లు, అలాగే ఏఐకి ప్రత్యక్ష సంబంధం లేని విభాగాలు ఈ ఉద్యోగాల కోత ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా, మెటా తన సొంత ఏఐ మోడల్ ‘Avocado’ అభివృద్ధి కోసం భారీ స్థాయిలో కొత్త నిపుణులను నియమించుకుంటోంది. ఇందుకోసం వందల మిలియన్ డాలర్ల ప్యాకేజీలతో ప్రతిభావంతులైన నిపుణులను తీసుకుంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!