

బీసీసీఐ ఆదేశాల మేరకు భారత క్రికెట్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ 7 ఏళ్ల విరామం తర్వాత ఢిల్లీ జట్టుకు, రోహిత్ శర్మ 15 ఏళ్ల తర్వాత ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగారు.
డిసెంబర్ 24న టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ల్లో ఇద్దరూ అదరగొట్టారు. రోహిత్ శర్మ సిక్కింకు వ్యతిరేకంగా ముంబై తరఫున సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ ఆంధ్రప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరఫున శతకం బాదాడు. ఈ ప్రదర్శనతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ డిసెంబర్ 26 (శుక్రవారం) మరోసారి మైదానంలోకి దిగనున్నారు.
ఢిల్లీ vs గుజరాత్ మ్యాచ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతుంది. ఇందులో విరాట్ కోహ్లీ ఆడతాడు.
ముంబై vs ఉత్తరాఖండ్ మ్యాచ్ జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ పాల్గొంటాడు.
ఈ రెండు మ్యాచ్లు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.
లైవ్ ప్రసారం ఎందుకు ఉండదు?
విజయ్ హజారే ట్రోఫీలో ఒకే రోజున 38 జట్లు ఆడుతుంటాయి. అంటే ఒకేసారి 19 మ్యాచ్లు జరుగుతాయి. అందువల్ల బీసీసీఐ అన్ని మ్యాచ్లను లైవ్ ప్రసారం చేయడం సాధ్యం కాదు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మాదిరిగానే కొన్ని మ్యాచ్లకే టీవీ, స్ట్రీమింగ్ సదుపాయం ఉంటుంది.
ప్రస్తుతం ప్రసార సౌకర్యాలు ఉన్నవి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం, రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం మాత్రమే. విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్ బెంగళూరులో, రోహిత్ శర్మ మ్యాచ్ జైపూర్లో జరుగుతున్నందున ఈ రెండు మ్యాచ్లకు లైవ్ టెలికాస్ట్ లేదా స్ట్రీమింగ్ ఉండదు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!