

శుక్రవారం నాటికి 14 ఏళ్ల 316 రోజులు మాత్రమే వయసున్న వైభవ్ సూర్యవంశీ సాధిస్తున్న విజయాలు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సాధారణంగా ఈ వయసులో పిల్లలు చదువులకే పరిమితమవుతుంటే, బిహార్కు చెందిన ఈ కుర్రాడు తనకంటే నాలుగు–ఐదు సంవత్సరాలు పెద్దవారితో కలిసి అండర్-19 ప్రపంచకప్లో ఆడుతూ అసాధారణ ప్రదర్శన చేశాడు. 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో కోటీశ్వరుడిగా మారిన అతడు, ఆపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓపెనర్గా కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి తన ప్రతిభపై ఉన్న సందేహాలన్నిటికీ తెరదించాడు.
అండర్-19 ప్రపంచకప్లో గ్రూప్ దశ, సెమీఫైనల్ దాటిన తర్వాత ఫైనల్లో వైభవ్ ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయే ఘనతగా మారింది. వన్డే మ్యాచ్లో సగం ఓవర్లకే ఈ స్కోరు సాధించడం అసామాన్యమైన విషయం. ఫైనల్లో అతడు కొట్టిన 15 సిక్సర్లతో యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే 150 పరుగులు సాధించి మరో రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. అతడి శక్తికి అద్భుతమైన ఫుట్వర్క్, టైమింగ్ తోడవడంతో ఈ ప్రదర్శన సాధ్యమైంది. ఈ నిలకడ చూస్తే వైభవ్ చరిత్రలో కలిసిపోయేవాడు కాదు—చరిత్ర సృష్టించేవాడనే విషయం స్పష్టమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!