

టీమ్ ఇండియా వెటరన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లలో అద్భుత ప్రదర్శనతో మునుపటి ఫామ్ను అందుకున్నాడు. తాజాగా దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఒక శతకం, ఒక అర్ధశతకంతోనూ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. అయితే, ఈ సమయంలోనే కోహ్లీ రిటైర్మెంట్పై టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
యాషెస్ ఐదో టెస్టులో జో రూట్ సెంచరీ చేసిన నేపథ్యంలో స్పందించిన మంజ్రేకర్, రూట్, విలియమ్సన్, స్మిత్ సెంచరీలు చేసిన ప్రతిసారీ కోహ్లీ గుర్తుకు వస్తాడని అన్నాడు. టెస్టు క్రికెట్ కోసం ఎంతో శ్రమించిన కోహ్లీ, అకాలంగా టెస్టుల నుంచి రిటైరవడం తనను నిరాశకు గురి చేసిందని పేర్కొన్నాడు. రిటైర్మెంట్కు ముందు ఐదేళ్లపాటు కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడని, తన సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయి ఉంటే బాగుండేదని, కానీ వన్డేలను ఎంచుకోవడం తనకు ఎక్కువగా నిరాశ కలిగించిందని మంజ్రేకర్ తెలిపారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లకు వన్డే ఫార్మాట్ చాలా సులభమని ఆయన అభిప్రాయపడ్డాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!