

ఆంధ్రప్రదేశ్కు చెందిన పారా స్విమ్మర్ బలగ గణేష్ మాస్టర్ పారా స్విమ్మింగ్లో అరుదైన ఘనత సాధించారు. జర్మనీ, స్విట్జర్లాండ్ మధ్య విస్తరించిన బోడెన్సీ సరస్సులో వెట్సూట్ లేకుండా 12 కిలోమీటర్ల దూరాన్ని ఈదుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. జర్మనీకి చెందిన స్వెన్ ఎకార్డ్ పేరిట ఉన్న 5 గంటల 33 నిమిషాల రికార్డును అధిగమించి, గణేష్ మాస్టర్ కేవలం 5 గంటల 14 నిమిషాల 13 సెకన్లలో ఈతను పూర్తి చేశారు. ఈ ఘనతపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గణేష్ మాస్టర్ను అభినందించారు.
గణేష్ మాస్టర్ సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ క్రీడా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిందని నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో ఉపాధ్యాయుడిగా ఎంపికైన గణేష్ మాస్టర్ పారా స్విమ్మింగ్లో ప్రపంచ రికార్డు సాధించడం గర్వకారణమని అన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ అపారమైన పట్టుదల, కఠోర సాధనతో ఆయన సాధించిన ఈ ఘనత ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. క్రీడల్లో మరింత ప్రతిభను చాటుతూ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!