

ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో నార్వేకు చెందిన గ్రాండ్మాస్టర్ మాగ్నస్ కార్లసన్ మరోసారి తన ప్రతిభను చాటాడు. మొత్తం 13 రౌండ్లుగా జరిగిన ఈ పోటీల్లో 10.5 పాయింట్లు సాధించిన కార్లసన్ అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్షిప్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఇది కార్లసన్ కు ఆరో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ విజయం కావడం విశేషం.
ఈ టోర్నీలో ఏడో రౌండ్లో రష్యా గ్రాండ్మాస్టర్ వ్లాదిస్లావ్ ఆర్టిమీవ్ చేతిలో ఓటమి ఎదురవడంతో కార్లసన్ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచ్లలో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి వరుస విజయాలు సాధించాడు. చివరకు అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్ను దక్కించుకున్నాడు. ఆర్టిమీవ్ 9.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైశీ కూడా 9.5 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని పొందాడు.
భారత ఆటగాళ్లలో వీఆర్ చిదంబరం అరవింద్ 8.5 పాయింట్లతో 16 వ స్థానంలో నిలిచాడు. అలాగే సరిన్ నిహాల్ 8.5 పాయింట్లతో 19 వ స్థానంలో, డి. గూకేష్ 8.5 పాయింట్లతో 20 వ స్థానంలో టోర్నీని ముగించారు.
మహిళల విభాగంలో రష్యాకు చెందిన గ్రాండ్మాస్టర్ అలెగ్జాండ్రా గోర్యచికినా చివరి రౌండ్లో ఝూ జినర్ను ఓడించి తన కెరీర్లో తొలి వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది. ఝూ జినర్ రెండో స్థానంలో నిలవగా, భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ముగ్గురూ 8.5 పాయింట్లు సాధించడంతో టైబ్రేకర్ నిబంధనల ఆధారంగా విజేతను నిర్ణయించారు.
ఈ టోర్నీలో భారత్కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ బి. శ్రీసవిత 8 పాయింట్లతో, గ్రాండ్మాస్టర్ ఆర్. వైశాలీ 8 పాయింట్లతో తదుపరి స్థానాల్లో నిలిచారు. ఇదే వేదిక పై బ్లిట్జ్ ఛాంపియన్షిప్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!