

న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ను భారత్ మిగిలిన రెండు మ్యాచ్లు ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులతో అజేయంగా మెరుపులు మెరిపించారు. ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 28 పరుగులు చేసి వేగవంతమైన ఆరంభం అందించాడు.

ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయినా భారత్ మూడు ఓవర్లకే 49 పరుగులు చేసింది. అభిషేక్ కేవలం 14 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేయగా, సూర్యకుమార్ చివరి ఓవర్లో బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 40 బంతుల్లో 100 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (48), మార్క్ చాప్మన్ (32), శాంట్నర్ (27) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/17) అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. నాలుగో టీ20 మ్యాచ్ ఈ నెల 28న విశాఖపట్నంలో జరగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!