

బుధవారం లక్నో లో జరగాల్సిన టీమ్ ఇండియా–దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా పూర్తిగా రద్దైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో టాస్ కూడా వేయలేకపోయారు. సాయంత్రం నుంచే అంపైర్లు పలుమార్లు మైదానాన్ని పరిశీలించగా, చివరిసారిగా రాత్రి 9.25 గంటలకు గ్రౌండ్ను తనిఖీ చేసిన అనంతరం మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మ్యాచ్ కోసం ఎదురుచూసిన అభిమానులు నిరాశతో మైదానం విడిచారు.
మ్యాచ్ రద్దు పై పలువురు ప్రేక్షకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. టిక్కెట్ల కోసం ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు చేశామని, వాటిని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే కొందరు అభిమానులు మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వడం మాత్రమే పరిష్కారం కాదని, టీమ్ ఇండియా మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్నో లో గత కొన్ని రోజులుగా పొగమంచు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, మ్యాచ్ను రాత్రి కాకుండా మధ్యాహ్నం నిర్వహించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ రిఫండ్ పాలసీ ప్రకారం ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దయితే, టికెట్ ధరను తిరిగి చెల్లించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, అనారోగ్యం కారణంగా అక్షర్ పటేల్, గాయం కారణంగా శుభ్మన్ గిల్ ఇప్పటికే నాలుగో, ఐదో టీ20 లకు దూరమైన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ డిసెంబర్ 19 న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ప్రస్తుతం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-1 తో ముందంజలో ఉంది. నాలుగో మ్యాచ్ రద్దయినప్పటికీ, భారత జట్టు సిరీస్ కోల్పోయే అవకాశం లేదు. ఐదో టీ20 లో భారత్ గెలిస్తే సిరీస్ను 3-1 తో కైవసం చేసుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ 2-2 తో సమమవుతుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!