

బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్గంజ్–3 నియోజకవర్గం నుంచి ఓ హిందూ నేత బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. గోవిందా చంద్ర ప్రామాణిక్ అనే అడ్వకేట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది.
ఇంకా ఎన్నికలకు నెల రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది ప్రజాగ్రహానికి గురైన షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. యూనస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ పోటీ చేసే అవకాశం కోల్పోయింది. ఈ ప్రకటన వెలువడిన సమయానికి, మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ దాదాపు 17 ఏళ్ల తరువాత స్వదేశానికి తిరిగి రావడం కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, యూనస్ ప్రభుత్వంపై షేక్ హసీనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్–భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిగా తాత్కాలిక ప్రభుత్వమే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్ పట్ల శత్రుత్వ వైఖరి అవలంబిస్తూ, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతోందని హసీనా ఆరోపించారు. ఇటీవల బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ముఖ్యంగా ఒక హిందూ వ్యక్తిని గుంపు దాడిలో హత్య చేయడం భారత్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అలాగే అక్కడి తీవ్రవాద సంస్థలు భారత్కు చెందిన దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. మొత్తంగా, వచ్చే ఎన్నికల్లో షేక్ హసీనా స్థానంలో గోవిందా చంద్ర ప్రామాణిక్ ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!