

రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో శనివారం ఉదయం ఉద్రిక్తతకు దారితీసిన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు తమ ప్రిన్సిపల్ అక్రమాలు, వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. కళాశాల హాస్టల్లో తగిన సౌకర్యాలు లేకపోవడం, ప్రిన్సిపల్ అనుచిత ప్రవర్తనతో విసుగెత్తిపోయిన విద్యార్థినులు పట్టణ ప్రధాన చౌరస్తాలో ధర్నాకు దిగారు. వీరి ఆందోళన కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఆ కానిస్టేబుల్ ఒక విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో విద్యార్థినులు ఆగ్రహానికి గురయ్యారు. “న్యాయం కోసం వస్తే మమ్మల్నే కొడతారా?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. పోలీసులు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినా విద్యార్థినులు కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో ఇలాంటి వేధింపులు, అక్రమాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెలువడుతున్నప్పటికీ, సాంఘిక సంక్షేమ శాఖ సరైన పర్యవేక్షణ చేయడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థినుల భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!