

విద్యార్థులకు అందించే యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం డిజైన్లలో వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర సామగ్రి పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. రెండో జతను నెలాఖరులోగా అందజేస్తామని వెల్లడించారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలు అందించినట్లు వివరించారు.
విద్యార్థులందరికీ నోట్ పుస్తకాల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్షీట్లు, టవళ్ల పంపిణీ కూడా పూర్తయిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే రోజే యూనిఫాం, ఇతర సామగ్రి అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం మంది చేరే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఏడాది పంపిణీ చేసిన యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని అధికారులు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!