

ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం (FBMS) అమలు పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకేచోట అందించే విధంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ను రూపొందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ఆధారంగా సేకరించి అప్డేట్ చేయాలని సూచించారు. పౌరసేవలు, ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు ఈ ఒక్క కార్డే ప్రధాన ఆధారంగా ఉండేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని తెలిపారు.
రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని అధికారులు సిద్ధం కావాల్సిందిగా ఆదేశించారు. మొత్తం 25 రకాల ప్రభుత్వ సేవలు, పథకాలు, అలాగే పీ 4 వంటి ముఖ్య అంశాలను ఈ కార్డులో చేర్చాలని సూచించారు.
ఆధార్, ఎఫ్బీఎంఎస్ ఐడీ, వాక్సినేషన్, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్షిప్లు, పెన్షన్లు వంటి విభిన్న సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ కార్డు ద్వారా ట్రాక్ చేసే విధంగా వ్యవస్థ ఉండాలని సీఎం అన్నారు. కేవలం రేషన్, పెన్షన్లకే పరిమితం కాకుండా పౌరులకు సంబంధించిన అన్ని కీలక డేటా ఇందులో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
సుపరిపాలనలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు సులభంగా చేరేందుకు ఈ స్మార్ట్ కార్డు కీలక పాత్ర పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎదురయ్యే సమస్యలు కూడా ఈ వ్యవస్థతో తగ్గుతాయని స్పష్టం చేశారు.
పట్టణాలు, గ్రామాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఆధార్ సహా అన్ని వివరాలు ఒకే కార్డు ద్వారా తెలిసేలా డిజైన్ చేయాలని సూచించారు.
2026 జనవరి నాటికి పూర్తి డేటాను సమీకరించి, జూన్లోగా కార్డుల పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!