

అమరావతి: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తమ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని భావిస్తున్నప్పటికీ, ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని ఆయన స్వయంగా అంగీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కలెక్టర్లను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ,
“మనం బాగా చేస్తున్నామని అనుకుంటున్నాం. నేను కూడా బాగా చేశానని అనుకుంటున్నాను. కానీ చివరికి ప్రజలకు అది నచ్చడం లేదు. మనం ఎవరి కోసం పనిచేశామో, ఆ ప్రజలే సంతృప్తిగా లేకపోతే ఏదో తప్పు జరుగుతోంది” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరుపై అంతర్గత సర్వేలు, నివేదికల ద్వారా వచ్చిన చేదు నిజాలను ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా కూటమి ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు, ప్రత్యర్థులపై వేధింపులు, పాలనలో జాప్యాలు ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. నెలలు గడుస్తున్నా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు కనిపించడం లేదన్న భావన బలపడుతోంది.
అలాగే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యంగా చెప్పబడుతున్న రాజధాని అమరావతి విషయంలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంలో ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాటలకే పరిమితమై, కార్యాచరణలో వెనుకబాటుతనం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తాజా వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతాయని, అదే సమయంలో కూటమిలో ఆందోళనకు కారణమవుతాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!