
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, దాదాపు 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అనే ప్రశ్న తలెత్తుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను పరిశీలిస్తే మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపిస్తున్నాయని జగన్ విమర్శించారు. అలాగే రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతున్నట్లు కాగ్ (CAG) నివేదిక స్పష్టంగా చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.80 వేల కోట్ల అప్పులు తీసుకుందని జగన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్-6, సూపర్-7 పథకాలు అమలు చేయకపోవడంతో పాటు తమ ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను కూడా రద్దు చేశారని విమర్శించారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు. తమ ఐదేళ్ల పాలనలో ఎన్బీసీ పరిమితికి తక్కువగానే అప్పులు చేశామని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎన్బీసీ పరిమితికి మించి రూ.12 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని జగన్ అన్నారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం మొత్తం రూ.3.80 లక్షల కోట్ల అప్పులు చేసిందని, తమ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.30 లక్షల కోట్ల అప్పులు మాత్రమే తీసుకుందని ఆయన వివరించారు.
రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని జగన్ ఆరోపించారు. “దోచుకో, పంచుకో, తినుకో” అనే విధంగా పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఇసుక, మట్టి, మద్యం, భూములు వంటి అన్ని రంగాల్లో అవినీతి జరుగుతోందని తెలిపారు. ఇలా అన్ని వనరులు దోచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. విశాఖపట్నంలో సుమారు రూ.5 వేల కోట్ల విలువైన భూమిని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు సమీప బంధువుకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా భూములను అతి తక్కువ ధరలకు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించిన జగన్, ప్రస్తుతం కరోనా వంటి పరిస్థితులు లేనప్పటికీ ట్రెజరీలో కనీస నిల్వలు కూడా లేవని విమర్శించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!