

కాస్పియన్ సముద్రంలో తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఒక నావికుడు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు టెహ్రాన్ వెల్లడించింది. తమ దేశ ప్రయోజనాలు, ఆస్తులను రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన ఇరాన్.. ఈ దాడికి ఉక్రెయిన్ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలంటే కీవ్ను కట్టడి చేయాలని ఐరోపా దేశాలను కోరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో తమకు సంబంధం లేదని ఇరాన్ మరోసారి పేర్కొనగా, రష్యా నుంచి టెహ్రాన్కు ఉపగ్రహ సమాచారం అందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు.
అమెరికా ఆంక్షల నేపథ్యంలో కాస్పియన్ సముద్ర మార్గం ఇరాన్కు వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. ఉత్తర దిశలోని ఈ మార్గం ద్వారా చైనా సహా పలు దేశాల నుంచి వస్తువులు ఇరాన్కు చేరుతున్న నేపథ్యంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు చెర్నిహివ్, ఖార్కివ్ తదితర ప్రాంతాలపై రష్యా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఏడు బాలిస్టిక్ క్షిపణులు, 136 డ్రోన్లతో దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఈ ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!