

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హరితా రిసార్ట్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల కోసం శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని నాయకులకు కీలక సందేశాలు ఇచ్చారు.
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, "సంఘటన సృజన్ అభియాన్ చారిత్రాత్మక కార్యక్రమం. నాణ్యమైన నాయకత్వాన్ని పెంపొందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ సిద్ధాంతాలను లోతుగా అర్థం చేసుకుని పనిచేయాలి" అని అన్నారు. ట్రైనింగ్ కార్యక్రమాల అవసరాన్ని గుర్తుచేస్తూ, 1970లో బాపట్లలో జరిగిన శిక్షణా శిబిరం పార్టీకి ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ త్యాగధనులకు కేరాఫ్ అడ్రస్ అని, పార్టీ సభ్యత్వం పొందడం కూడా గౌరవమని చెప్పారు.
అలాగే, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల్లో నమ్మకం పెరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తుక్కుగూడ సభలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజార్టీ అమలు చేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయాలను గుర్తుచేశారు. సోషల్ మీడియా ప్రచారంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సంఘటన సృజన్ కార్యక్రమం ఇప్పటికే 14 రాష్ట్రాల్లో విజయవంతమైందని, తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!