

భూ అక్రమ దందాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నిధులు సమీకరిస్తున్నారని, ఆ నిధులను దాచుకునేందుకే షెల్ స్పేస్ కంపెనీలను తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి తుక్కుగూడలో ప్రభుత్వం కేటాయించిన భూముల వద్ద కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. శాసనసభ నుంచి సస్పెన్షన్ నేపథ్యంలో కేటీఆర్ నివాసంలో సమావేశమైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనంతరం ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే సీఎం సోదరుడి కంపెనీకి కేటాయించారని కేటీఆర్ ఆరోపిస్తూ, భూ కేటాయింపుపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు కల్పించడం అధికార దుర్వినియోగం కాదా, కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. సీఎం మరో సోదరుడి సంస్థ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్తో కుదుర్చుకున్న ఒప్పందంపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాయాజాలం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో ఫార్మాసిటీ కోసం షరతులతో భూసేకరణ జరిగిందని, ఆ భూములను ఇప్పుడు ఇతర కార్యకలాపాలకు వినియోగించడం చట్టపరంగా సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. రేవంత్రెడ్డి కుటుంబ ప్రయోజనాల కోసం జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో పెట్టుబడిదారులు బలిపశువులు కావొద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి ఫ్యూచర్ సిటీ వ్యవహారాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. నిరసనలో మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!