

తమిళ సినీపరిశ్రమలో ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం చూట్టూ వివాదం నడుస్తోంది. రోజురోజుకు ఈ వివాదం పెను రాజకీయ తుఫానుగా మారుతోంది. ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు నటిస్తున్న ఈ చివరి చిత్రం విడుదలపై సెన్సార్ బోర్డ్ ఆంక్షలు విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 9 న విడుదల కావాల్సిన ఈ చిత్రం సర్టిఫికేట్ రాకపోవడంతో వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో, విశ్వనటుడు, ఎంపీ కమల్ హాసన్ విజయ్కు మద్దతుగా బహిరంగ లేఖను విడుదల చేశారు. "కళ కోసం, కళాకారుల కోసం, రాజ్యాంగం కోసం" అంటూ ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. సినిమా అనేది కేవలం ఒక వ్యక్తి శ్రమ కాదు; రచయితలు, సాంకేతిక నిపుణులు, ప్రదర్శకులు, చిన్న వ్యాపారుల జీవనోపాధి. పారదర్శకత లేని నిర్ణయాల వల్ల సృజనాత్మకత దెబ్బతినడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది అని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ ప్రక్రియలో సంస్కరణలు రావాలని, కట్స్ లేదా మార్పులు సూచించినప్పుడు దానికి తగిన కారణాలను లిఖితపూర్వకంగా వివరించాలని ఆయన డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
.jpeg)
సినిమా విడుదల పరిస్థితి
కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ ప్రకారం, డిసెంబర్లోనే ఎగ్జామినింగ్ కమిటీ సినిమా చూశి UA 16+ సర్టిఫికేట్ ఇస్తుందని ధృవీకరించింది. అయితే, విడుదలకు నాలుగు రోజుల ముందు బోర్డు సినిమా ‘రివైజింగ్ కమిటీ’కి పంపింది. దీనిపై నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి సింగిల్ బెంచ్ వెంటనే సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. తర్వాత, బోర్డు డివిజన్ బెంచ్లో సవాల్ చేయడంతో కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21 కి వాయిదా పడడంతో సినిమా రిలీజ్ బ్రేక్ అయ్యింది.
విజయ్ తన తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని, సినిమా లోని రాజకీయ అవినీతిని ప్రశ్నించే సీన్లు ఉన్నాయని, అందుకే కావాలనే సెన్సార్ బోర్డు అడ్డుపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో #ReleaseJanaNayagan హ్యాష్ట్యాగ్తో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కమల్ హాసన్ వంటి దిగ్గజాలు మద్దతు ఇచ్చిన తర్వాత, వివాదం ఇప్పుడు సినీ రంగం దాటి రాజకీయ రంగానికి కూడా పులుముకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!