
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం మరియు నిర్వహణలో అవకతవకల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఏప్రిల్ 8కు వాయిదా వేసింది. 2024 మార్చి 14న జారీ చేసిన జీఓ 6 ద్వారా కమిషన్ను ఏర్పాటు చేసిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషి పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
విచారణ సందర్భంగా హరీశ్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ, కమిషన్ ఏర్పాటు పై తమకు అభ్యంతరం లేదని కానీ విచారణ విధానంలో సహజ న్యాయసూత్రాలు పాటించలేదని తెలిపారు. పిటిషనర్లకు సరైన అవకాశాలు ఇవ్వకుండా సాక్షులుగా పిలిచి ఆరోపణలు మోపారని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచిందని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని పేర్కొన్నారు. మరోవైపు అధికారుల తరఫున న్యాయవాదులు తమకు సాక్షులుగా మాత్రమే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు అవకాశం ఇచ్చి తీర్పును ఏప్రిల్ 8కు వాయిదా వేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!