

వంగవీటి రంగాపై రౌడీగా దూషిస్తూ, ఆయన హత్యను సమర్థించే స్థాయిలో గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత గౌతమ్రెడ్డికి ఫైబర్నెట్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన వ్యక్తి జగన్రెడ్డిని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రంగ హత్య కేసులో నిందితులు నేడు వైసీపీలో ఉండి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. పేరు చివర ‘రెడ్డి’ ని చేర్చుకున్న ముద్రగడ పద్మనాభం కాపులపై వ్యాఖ్యానించడం విహసనాత్మకంగా ఉందని విమర్శించారు. జగన్ను మెప్పించేందుకు తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అలాగే 2014 – 19 మధ్య చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో చిన్న సోషల్ మీడియా పోస్టుకే జైలుకు పంపిన జగన్, ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిపై పార్టీ పరంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాంబాబును జగన్ పాములా ఉపయోగిస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!