

కాంగ్రెస్ పార్టీ తనకు పరకాల అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ ప్రకటించారు. పరకాల నియోజకవర్గంలో తన తల్లి జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని సుష్మిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయంలో తన తండ్రి కొండా మురళీ సహకరించారని, అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చినా అది నెరవేరలేదని పేర్కొన్నారు.
కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగలరా అని సుష్మితా పటేల్ సవాల్ చేశారు. పరకాల టికెట్ను రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తూ, దమ్ముంటే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తనపై కౌంటర్ ఇస్తే మరిన్ని విషయాలు బయటపెడతానని హెచ్చరిస్తూ, రేవంత్ రెడ్డి మరియు ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారో లేదో కూడా సందేహమేనని ఆమె వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!