

హిమంత బిశ్వ శర్మ ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అస్సాం సీఎంగా రెండోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాగా.. ఈ నెల 12న జరగనున్న సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తదితరులు హాజరుకానున్నారు. ఈ మేరకు సంబంధిత ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు సీఎస్ రవి కోట తెలిపారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, వేదిక సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో వివరంగా చర్చించినట్టు ఆయన వెల్లడించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు జరగడం, నిర్దేశించిన నియమాలను కచ్చితంగా పాటించడం అత్యంత ప్రధానమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సంబంధిత శాఖలన్నీ అత్యున్నత స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు సీఎస్ తెలిపారు. ఆ రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 126 స్థానాలకు గాను 102 స్థానాలను గెలుచుకుని.. మూడింట రెండొంతుల భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడం ఇదే తొలిసారి













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!