

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణం సహా పరిసర ప్రాంతాలు తీవ్ర ముంపు ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సీఈఓకు లేఖ రాశారు. పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా అదే కావడం వల్ల పట్టణానికి నిత్యం జలగండం పొంచి ఉందని పేర్కొన్నారు. ముంపు గ్రామాలతో పాటు పరిశ్రమలకు కూడా బ్యాక్వాటర్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
2022లో కాఫర్ డ్యామ్ ప్రభావంతో భద్రాచలం, బూర్గంపాడు, సారపాక ప్రాంతాలు భారీగా నష్టపోయాయని గుర్తుచేసిన హరీశ్ రావు, భవిష్యత్తులో మరింత పెద్ద వరదలు వస్తే తెలంగాణకు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం, శాశ్వత పునరావాసం కల్పించడంతో పాటు భద్రాచలం వద్ద కరకట్టల నిర్మాణం, పంపింగ్ స్టేషన్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ముంపు సమస్యల పర్యవేక్షణ కోసం భద్రాచలంలో ప్రత్యేక పీపీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!