

నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదం పై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు.
ఈ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లామని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి వెల్లడించారు. అలాగే అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాల పై లోతైన విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో, సంబంధిత షాపు యజమాని పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా శాఖలు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలు లేదా వ్యాపార సముదాయాలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!