

టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి ఆలయం, లడ్డూ ప్రసాదం, నెయ్యి కొనుగోళ్లు వంటి అంశాల పై తన పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. శ్రీవారి ఆస్తులు, గౌరవం పెంచడానికి మాత్రమే పనిచేశానని, దేవుడికి సంబంధించిన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదని ఢిల్లీ వేదికగా స్పష్టం చేశారు.
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ప్రచారం పూర్తిగా తప్పుడు అని అన్నారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి ట్యాంకర్లు పూర్తిగా పరీక్షించిన తర్వాతే వాడతామని వెల్లడించారు. ల్యాబ్ పరీక్షల్లో స్పష్టత రాకుండా మీడియా కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
2014 నుంచి 2019 మధ్యకాలం నెయ్యి కొనుగోళ్ల పైనే విచారణ ఎందుకు జరుగుతోందని ప్రశ్నించిన సుబ్బారెడ్డి, గత ప్రభుత్వకాలంలో కూడా ఇదే విధమైన పరిశీలనలు జరగాల్సిందని అభిప్రాయపడ్డారు. లడ్డూ అంశం పై సిట్ విచారణకు వెళ్లినప్పుడు కూడా ఇదే విషయాలను వివరించానని, అవసరమైతే పాలీగ్రాఫ్ పరీక్షకూ సిద్ధమని ప్రకటించారు.
తక్కువ ధరకు నెయ్యి కొన్నందుకే కల్తీ నెయ్యి వాడారన్న విమర్శలు వస్తున్నాయని, ఇవన్నీ అపార్థాలు మాత్రమేనని స్పష్టం చేశారు. టీటీడీ ఆస్తుల పై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తుచేశారు. శ్రీవారి ఆదాయాన్ని కాపాడడానికి, వినియోగదారులకు పారదర్శక సేవలు అందించడానికి ఎన్నో సంస్కరణలు చేసినట్లు తెలిపారు. L1, L2 దర్శనాలు రద్దు చేసి, శ్రీ వాణి దర్శనాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు.
తిరుమలలో ప్లాస్టిక్కు పూర్తి నిషేధం అమలు చేసినట్లు, 516 గోశాలలకు ఆర్థిక సహాయం అందించామని, పద్మావతి హృదయాలయం ఆస్పత్రిని స్థాపించామని వివరించారు. శ్రీనివాస సేతు నిర్మాణ వ్యయాన్ని 50 నుంచి 70 కోట్ల వరకు తగ్గించామని పేర్కొన్నారు.
పరకామణిలో జరిగిన దొంగతనం అంశం పై సీఐడీ విచారణకు రమ్మన్నందుకు రేపు హాజరవుతున్నానని తెలిపారు. తన మాజీ పీఏ అప్పన్నకు టీటీడీ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
Transparent and responsible