

బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల పార్టీ మార్పు కేసుపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు చేసిన ఫిర్యాదులపై విచారణ పూర్తి చేయాలని కోర్టు ఇంతకుముందు అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది. అయితే నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేయలేకపోయిన స్పీకర్ కార్యాలయం, అదే రోజున మరిన్ని ఎనిమిది వారాల గడువు ఇవ్వాలని కోర్టును కోరింది. స్పీకర్ రోజువారీ కీలక కార్యక్రమాలు, స్పీకర్ల అంతర్జాతీయ సమావేశాలు, విదేశీ పర్యటనలు వంటి కారణాల వల్ల విచారణను తేల్చడం సాధ్యంకాలేదని తెలిపింది.
ఇక మరోవైపు, విచారణను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. అదేవిధంగా, ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లతో పాటు సంబంధిత అంశాలన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియా లతో కూడిన ధర్మాసనం విచారణకు తీసుకోనుంది.
స్పీకర్కు కోర్టు మరిన్ని రోజులు ఇస్తారా? ఇస్తే ఎంతకాలం గడువు పెడతారు? అనే విషయంపై స్పష్టత సోమవారం రావచ్చు. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి ఎమ్మెల్యేలను ఇప్పటివరకు విచారించలేదన్న అంశంపై కూడా బీఆర్ఎస్ తన వాదనలు వినిపించే అవకాశం ఉంది.
మరోవైపు చూస్తే, ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 24 న పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనే ఈ కేసుపై తుది తీర్పు ఇచ్చే అవకాశముందా? లేక ఇతర ధర్మాసనానికి మార్చుతారా? అనేది రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!