

ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రోడ్ డెన్సిటీ పెంపు, ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణంపై సమగ్రంగా చర్చించారు. సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా రహదారి ప్రాజెక్టులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
శ్రీకాకుళంలోని మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటి ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సీఎం సూచించారు. హింటర్ల్యాండ్ ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాల వరకూ సరుకు రవాణా సులభంగా జరిగేలా రోడ్డు కనెక్టివిటీ పెంచాలని ఆదేశించారు. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4, 6 లేన్లుగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. బెంగుళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ను 2027 నాటికి పూర్తి చేయాలని, ఖరగ్పూర్–అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేకు త్వరగా డీపీఆర్లు సిద్ధం చేయాలని సూచించారు. రహదారి ప్రాజెక్టుల అమలులో దేశానికి ఏపీ బెంచ్మార్క్గా నిలవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!