

హైదరాబాద్లోని ప్రజా భవన్లో బాల భరోసా పథకం, ప్రణామ్ డే కేర్ సెంటర్ల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరై, మంత్రులతో కలిసి పథకాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, విద్యార్థులను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యతో పాటు ఉద్యోగ అవకాశాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.
దివ్యాంగుల విషయంలో దివంగత నాయకుడు జైపాల్ రెడ్డి స్ఫూర్తిదాయకమని పేర్కొన్న సీఎం, ఆయనకు వైకల్యం ఉందనే భావన కూడా ఎప్పుడూ అడ్డంకిగా మారలేదని అన్నారు. అదే స్ఫూర్తితో దివ్యాంగులను ముందుకు నడిపించాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం విధానాలు అమలు చేస్తోందని వివరించారు.
ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోందని సీఎం తెలిపారు. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లకు ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇది సమాజంలో వారికి గౌరవం, గుర్తింపు కల్పించే కీలక అడుగుగా మారుతుందని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!