

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత బలం చేకూర్చింది. ఈ పథకం నిరంతరంగా కొనసాగేందుకు అదనంగా రూ.800 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఈ ఏడాది నవంబర్ నుంచి 2026 మార్చి వరకు నెలకు రూ.160 కోట్ల చొప్పున నిధులను విడుదల చేయనున్నారు. ఇప్పటికే కేటాయించిన నిధులకు అదనంగా ఈ మొత్తాన్ని మంజూరు చేయడం ద్వారా పథక అమలులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.400 కోట్లను విడుదల చేసింది. తాజా నిధుల విడుదలతో పథకం మరింత సమర్థవంతంగా కొనసాగనుంది.
నిధుల విడుదలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆర్టీసీ ఎన్ఎంయూఏ, ఉద్యోగ సంఘాలు, కార్మిక పరిషత్ నాయకులు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సంక్షేమం, ప్రజారవాణా వ్యవస్థకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వారు ప్రశంసించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!