

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని పునరుద్ఘాటించారు. అసెంబ్లీ తీర్మానం ద్వారా అమరావతికి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత కల్పించబడిందని, దాని స్థానాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్రానికి గుండె, ఆత్మ అని పేర్కొంటూ, ప్రస్తుతం రూ.56 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2027–2028 నాటికి ప్రధాన నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. 34,400 ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల త్యాగాన్ని కొనియాడుతూ, ఇది ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం, మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని, రైతుల ఉద్యమాలను అణచివేసారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో జగన్ గైర్హాజరైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. హైదరాబాద్ను మించిన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసి ముందుకు సాగాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!