

రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర–2047 విజన్ అమలుకు అన్ని ప్రభుత్వ శాఖలు పది మిషన్ల రూపంలో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ లక్ష్యాలు ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం అవసరమని తెలిపారు.
పేదరికం లేని సమాజం నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసిన సీఎం, ప్రతి కుటుంబానికి సాధికారత, ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. పాలనలో వేగం పెంచి, పౌరులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి శాఖ తమ పనితీరు సూచికలను సిద్ధం చేసుకుని, వాటిని విజన్ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు.
నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న సీఎం, 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. నైపుణ్య పోర్టల్ ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలన్నారు.
నీటి భద్రత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నీటి వనరుల సమర్థ వినియోగంతో పాటు నీటి ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. అలాగే, రవాణా వ్యయాన్ని తగ్గించేలా లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలని, రోడ్డు, రైలు, జలరవాణా, కార్గో, కోల్డ్ చైన్ సదుపాయాల పై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆర్గానిక్ కూరగాయల సాగు, రైతుల ఆదాయం పెంపు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గాలి–నీటి నాణ్యత మెరుగుదల పై దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!