

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మానసిక ఉత్కంఠభరిత చిత్రం సరస్వతి. ఈ చిత్రంలో ప్రియమణి, ప్రకాష్ రాజ్, రావు రమేశ్, రాధిక శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 6 న విడుదలైన ఈ సినిమా మంచి స్పందన పొందినప్పటికీ వసూళ్ల పరంగా అంతగా రాణించలేదు.
ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది. థియేటర్లలో చూడలేకపోయిన వారికి ఇది మంచి అవకాశం.
సరస్వతి కథేంటంటే.. లక్ష్మి(వరలక్ష్మి శరత్కుమార్) సింగిల్ మదర్. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్ట్ 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదేరోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఓ ఫోన్ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదేరాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.
అయితే సీఐ కృష్ణారెడ్డి(మురళీ శర్మ) మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానంటూ.. శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది. న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్)ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయ సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడిందెవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!