
.jpeg&w=3840&q=75)
తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 3,800 కు పైగా గ్రామ పంచాయతీలలోని సుమారు 37,000 వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు 3,000 కు పైగా గ్రామ పంచాయతీలలో వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టి, సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, టీఎస్ఎస్పీ బలగాలతో పాటు డిప్యూటేషన్ సిబ్బందిని కూడా మోహరించినట్లు వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాలను 'క్లిష్టమైన' మరియు ‘సాధారణమైన’గా వర్గీకరించి, అవసరానికి అనుగుణంగా భద్రతా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం జరిగే ఓట్ల లెక్కింపుకు కూడా పూర్ణ భద్రత కల్పించినట్లు వివరించారు.
ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా ఇప్పటివరకు ₹8.20 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు మరియు ఇతర ప్రలోభకర వస్తువులు ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా స్వాధీనం చేసినట్లు డీజీపీ తెలిపారు. మొత్తం 229 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, 1,053 నాన్-బెయిలబుల్ వారెంట్లు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల భద్రతా నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన ఆయుధాలను అన్నింటిని డిపాజిట్ చేయించారని చెప్పారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో 54 అంతర్-రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 537 ఫ్లయింగ్ స్క్వాడ్లు మరియు 155 స్టాటిక్ నిఘా బృందాలు ఎన్నికల మార్గదర్శకాల అమలులో చురుకుగా పనిచేస్తున్నాయని డీజీపీ బి. శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!