

తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. ముక్కోటి ఏకాదశి సమయం వచ్చేసరికి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముక్కోటి ఏకాదశికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల పై సోమవారం తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరుకానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్ల పై మంత్రులు సమీక్షించనున్నారు.
డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల దర్శనాల కోసం ఈ-డిప్ విధానంలో టోకెన్లు కేటాయించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మొత్తం 164 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.
మొదటి మూడు రోజుల తర్వాత మిగిలిన ఏడు రోజుల్లో ఎటువంటి టోకెన్లు లేకుండానే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్నప్రసాద వితరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాల పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
గతేడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా టోకెన్ల కోసం తిరుపతిలో ఏర్పడిన రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో పెట్టుకుని, ఈసారి అటువంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, టీటీడీ ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడమే లక్ష్యంగా ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!