
.jpg&w=3840&q=75)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పండుగ కళతో ముస్తాబైంది. అంతర్జాతీయ స్థాయి పతంగుల ప్రదర్శనలు, రుచికరమైన స్వీట్లతో సందర్శకులను ఆకట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ప్రారంభించనున్నారు.
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, అలాగే దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 మంది జాతీయ స్థాయి కైట్ ఫ్లయర్స్ పాల్గొననున్నారు. సాధారణ గాలిపటాలకు భిన్నంగా, భారీ పరిమాణంలో, వివిధ ఆకృతుల్లో రూపొందించిన ప్రత్యేక పతంగులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రాత్రివేళ వెలుగులతో ఎగిరే పతంగులు ప్రత్యేకంగా సందర్శకులను ఆకట్టుకుంటాయి.
పతంగుల పండుగతో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ స్వీట్లు సహా పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన ఇంటివంటల స్వీట్లు ఫుడ్ కోర్ట్లోని 60 స్టాళ్లలో అందుబాటులో ఉంటాయి. అదనంగా చేనేత, హస్తకళలకు సంబంధించిన 100 స్టాళ్లను ఏర్పాటు చేశారు. భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చనున్నాయి.
నగర బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిమాపక ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. నగరవాసులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!