

తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేయడం, అలాగే నిందితుడు రవికుమార్ ఆస్తులకు సంబంధించిన నివేదికల పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు అంశాలకు సంబంధించిన అదనపు నివేదికలను సీల్డ్ కవర్లో సిద్ధం చేసి సోమవారం నాటికి రిజిస్ట్రార్ జ్యుడీషియల్కు అందజేయాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు కోర్టు సూచించింది.
లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధత పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్. రఘునందనరావు ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆ నివేదికలు తమ పరిశీలన కోసం రిజిస్ట్రీ ముందు ఉంచాలని స్పష్టం చేసింది.
గత విచారణలో నిందితుడు రవికుమార్ తరఫున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు ఈ నివేదికల ప్రతులు తమకూ ఇవ్వాలని కోరిన విషయం కోర్టు గుర్తు చేసింది. అయితే, ఈ దశలో నిందితుడు ఆ పత్రాలను పొందే అర్హత లేనని ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం సమర్పించిన సమాచారం కోర్టు అంతర్గత పరిశీలన కోసమేనని స్పష్టం చేసింది.
నివేదికలను అధ్యయనం చేసిన తరువాత తగిన ఉత్తర్వులను జారీ చేయడానికి విచారణను ఈ నెల 9 కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ప్రకటించారు.
ఇక ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మాట్లాడుతూ, కేసులో తాము ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. కొత్త న్యాయవాదికి వకాలత్ సమర్పించినందున, కేసుల జాబితాలో ఆ న్యాయవాది పేరును చేర్చాలని కోరగా, కోర్టు దీనికి అంగీకరించి తగిన సూచనలు చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!